రెండవ థెస్సలొనీకయులకు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

పౌలు ఒక నగరాన్ని సందర్శించి, వారాలు లేదా నెలలు సువార్తను ప్రకటించి విశ్వాసములోనికి మారినవారిని మార్గనిర్దేశం చేయడం ద్వారా సంఘమును స్థాపించినంతమాత్రమున ఇది క్రొత్త సంఘమును మతభ్రష్టుల నుండి కాపాడలేకపోయింది. వాస్తవానికి, ఏదైనా క్రొత్త సంఘము యొక్క అపరిపక్వత అనేది సత్యాన్ని తప్పుదారి పట్టించడానికి మరియు వక్రీకరించడానికి ఉద్దేశించిన వారికి సరైన లక్ష్యాన్ని సమర్పిస్తుంది. తన స్నేహితుల గురించి మరియు తప్పుడు బోధకుల వలన వారు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆందోళన చెందుతున్న పౌలు, థెస్సలొనీకలోని విశ్వాసులకు, అనగా అనుభవము లేనివారైనను త్వరితంగా అభివృద్ధినొందుచున్నవారిని ప్రోత్సహించాలనే ఆశతో ఈ రెండవ లేఖ రాశాడు.

మనమెక్కడ ఉన్నాము?

పౌలు మొదటి పత్రిక రాసిన కొద్ది నెలల్లోనే క్రీ.శ. 51 లో కొరింథు నుండి 2 థెస్సలొనీకయులను వ్రాసాడు. రెండవ పత్రిక యొక్క విషయం మొదటిదానితో అనేక నేపథ్య సారూప్యతలను కలిగి ఉన్నందున, పౌలు బహుశా ఈ నగరం నుండి రెండవ నివేదికను అంత్య కాలానికి సంబంధించిన ప్రశ్నలు లేదా సమస్యలను వివరిస్తూ అందుకున్నాడు. పౌలు యొక్క అనేక సూచనలు థెస్సలొనీకలో కొందరు ఈ క్రొత్త విశ్వాసులను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టిస్తున్నారని సూచిస్తున్నాయి, తప్పుడు బోధకులు పౌలు నుండి వచ్చినట్లుగా కనిపించేలా పత్రికలను నకిలీ చేసేంత వరకు పరిస్థితి వచ్చింది (2 థెస్సలొనీకయులకు 2:2). అందువల్ల, అపొస్తలుడు ఈ పత్రికలో థెస్సలొనీకయులు యుగాంతమును గూర్చిన తన అభిప్రాయాలను మాత్రమే కాకుండా, అతని చేవ్రాత ఎలా ఉందో అర్థం చేసుకునేటట్లుగా, అలాగే వారు అతని పత్రికలను నిశ్చయముగా గుర్తించగలుగునట్లుగా (3:17) తగు జాగ్రత్తలు తీసుకున్నాడు.

రెండవ థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక ఎందుకంత ముఖ్యమైనది?

రెండవ థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక యుగాంతమును గూర్చి అందించే వివరణాత్మక బోధన ద్వారా ప్రత్యేకించబడింది. తప్పుడు బోధకులు పౌలు నుండి వచ్చినట్లుగా నకిలీ పత్రికలను ప్రదర్శిస్తూ, థెస్సలొనీక విశ్వాసులకు ప్రభువు దినం ఇప్పటికే వచ్చేసిందని చెబుతున్నారు. ఉగ్రత దినము భూమిమీదికి రాకముందే వారు ఎత్తబడతారని పౌలు తన మునుపటి పత్రికలో ప్రోత్సహించినందున ఈ తప్పుడు బోధకుల బోధ వారికి చాలా ఇబ్బంది కలిగించింది.

కాబట్టి పౌలు ఈ భవిష్యత్ శ్రమల కాలం ఇంకా రాలేదని వారికి వివరించాడు, ఎందుకంటే ఒక నిర్దిష్ట “పాపపురుషుడు” ఇంకా బయటపడలేదు (2 థెస్సలొనీకయులకు 2:3). దానియేలు, మత్తయి మరియు ప్రకటనలోని ఇతర భాగాలతో పోల్చి చూస్తే ఈ వ్యక్తి మరెవరో కాదు అంత్యక్రీస్తని తెలుస్తుంది. కానీ థెస్సలొనీకయులను ఆందోళన చెందవద్దని పౌలు ప్రోత్సహించాడు, ఎందుకంటే ఒక మర్మమైన అడ్డగించుచున్నవాడు భూమి నుండి తొలగించబడే వరకు అంత్యక్రీస్తు రాడు, థెస్సలొనీకయులకు అతని గుర్తింపు స్పష్టంగా తెలుసు (2:6-7). ఈ అడ్డగించువాని యొక్క గుర్తింపు చాలా చర్చనీయాంశమైంది. అయినప్పటికీ, ఆ అడ్డగించువాడు చేసే పని యొక్క స్వభావం కారణంగా, ఆయన సంఘము ద్వారా విమోచనతో పనిచేసే దేవుని ఆత్మయై ఉండవచ్చు. విశ్వాసులు ఎత్తబడి భూమిని విడిచిపెట్టునప్పుడు, మిగిలి ఉన్న వారందరూ శ్రమ యొక్క ఉగ్రతను అనుభవిస్తారు.

రెండవ థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక యొక్క ఉద్దేశమేమిటి?

తప్పుడు బోధకుల ఒత్తిడితో తమ విశ్వాసంలో దృఢముగా నిలబడటానికి ప్రయత్నిస్తున్న థెస్సలొనీక విశ్వాసుల పట్ల ఆందోళన చెందుతున్న అపొస్తలుడైన పౌలు, థెస్సలొనీకయులకు క్రీస్తు భవిష్యత్ రాకడపై వారి నిరీక్షణ అనేది వారి బాధలలో వారికి ప్రోత్సాహంగా ఉపయోగపడాలని, ఆయన కొరకు బాధ్యతాయుతంగా జీవించటానికి వారిని ప్రేరేపించాలని ఈ లేఖలో బోధించాడు. ఇంత లోతుగా కలిగియున్న విశ్వాసం ఫలితంగా పౌలు యేసును గూర్చిన తన బోధను ఎల్లప్పుడూ ఆచరణాత్మక ఎదుగుదలతో అనుసంధానించాడు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

భౌతికమైనవాటి మీద దృష్టి సారించే సమాజంలో క్రమశిక్షణ మరియు ఆశానిగ్రహము అనే రెండు లక్షణాలు చాలా శీఘ్రముగా గతించిపోతాయి. అందువల్ల ప్రజలు తమ జీవితాలను నిర్దేశించాల్సిన ఆత్మీయ వాస్తవాలను మరచిపోతారు. ఆర్థిక మరియు భౌతిక విజయంతో కొవ్వుపట్టి, ఈ రోజు చాలా మంది వికృత మరియు సోమరితనముతో కూడిన ఉనికిలోనికి వచ్చారు. అది ఇతరులపట్ల, ప్రత్యేకించి మన వ్యక్తిగత, శరీరకమైన కోరికలకు విరుద్ధముగా ఉండేవారి కొరకు పెద్దగా విచారించదు. మీరు బాగా జీవించి ఇతరులకు సేవ చేయాలన్న దేవుని కోరికతో మీ రోజువారీ జీవితం ఎలా విభేదిస్తుంది?

క్రీస్తునందు నిరీక్షణ దైవిక జీవనంలో ఓర్పును ప్రోత్సహిస్తుందని పౌలుకు తెలుసు. ఈ నిరీక్షణే ఈ రోజు మనకు లోపించినది. ఈ లోపమే స్వార్థము పెరిగిపోవటానికి ఒక పెద్ద కారణమైయ్యింది. మీరు 2 థెస్సలొనీకయుల మాటలను చదువుతున్నప్పుడు, మీ నిరీక్షణను రగిలించేవిగాను, దేవుని ఘనపరచే శ్రద్ధగల త్రోవల్లో జీవించునట్లు మీ కోరికను ప్రజ్వలింపచేయుటకు ఆ మాటలను అనుమతించండి.